Kullu Valley: Exploring the Enchanting Beauty of Kullu Valley-4

Kullu Valley: Exploring the Enchanting Beauty of Kullu Valley-4

Exploring the Enchanting Beauty of Kullu Valley మోహింపజేసే కులూ వ్యాలీ అందాల అన్వేషణ:

Kullu Valley: Himachal Pradesh గుండె భాగంలో విరాజిల్లే Kullu, Manali, Paravati వ్యాలీలు ప్రకృతి ప్రేమికులు, సాహసయాత్రికులు మరియు శాంతి కోరే వారిని ఆకర్షించే అద్భుత గమ్యస్థానాలు.

మంచుతో కప్పబడిన శిఖరాలు, హరిత పర్వత మార్గాలు, నదీ తీరాలు, మరియు స్థానిక సంస్కృతి మేళవింపు ఈ ప్రాంతాలకు ప్రత్యేకతను కల్పిస్తాయి.ప్రతి మూల కూడా ఒక కథను చెబుతుంది. ఈ వ్యాసం ఈ మూడు అపూర్వమైన వ్యాలీల సౌందర్యం, ముఖ్య ఆకర్షణలు మరియు రహస్య గమ్యాలపై దృష్టి పెడుతుంది. మీరు ప్రయాణానికి సిద్ధమవుతున్నా, అన్వేషణ చేయదలుచుకున్నా, హిమాచల్‌ ప్రదేశ్ అందాల లోకానికి ఈ మార్గదర్శిని మీకు సహాయకారిగా ఉంటుంది.

గతంలో ‘ కులంత ‘ లోయగా ప్రసిద్ధి చెందిన కులూలోయ పశ్చిమ హిమాలయాల్లో విస్తరించి వుంది. ఈ లోయలో బీస్ నది ఉత్తరం నుంచి దక్షిణ దిశకు సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. అక్కడక్కడా దాదాపు రెండు కిలోమీటర్లు వెడల్పుతో వున్న ఈ నదీలోయని దేవతల లోయగా ప్రాచీన గ్రంధాలు ఉదహరించాయి. కులూలోయ గురించి రామాయణ, మహాభారత గ్రంధాల్లోనే కాకుండా విష్ణు పురాణం కూడా వర్ణించబడింది.

 ఆ అందాల్ని చూసేందుకు ఈ కులూ లోయలోని ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించటం అంత సులభం కాదు. రెండు కళ్ళూ చాలవు. లోయనానుకుని పెట్టని గోడల్లా కనిపించే హిమాలయ గిరి సమూహ సౌందర్యం మనల్ని కట్టిపడవేస్తుంది. వసంత ఋతుకాలంలో ఈ లోయలోని రంగురంగుల పూల అందాల్ని తప్పక గమనించాలి ? కొండలన్నీ కూడా పూల చెట్లతోనూ పూ పరిమళాలతోనూ గుబాళిస్తాయి.

 శీతాకాలంలో మంచు మునుగుని వేసుకున్న హిమగిరి సౌందర్యం యింతా అంతా కాదు. మంచులేని సమయాల్లో కేవలం పచ్చికతో నిండిన ప్రదానాలు సాక్షాత్కరించే పర్వత చరణభూములు మనకిక్కడ కనిపిస్తాయి. సముద్రమట్టానికి 1220 మీటర్ల ఎత్తులో విస్తరించి వున్న కులూలోయని చేరుకునేందుకు ఢిల్లీ నుంచి వాయురూత్ విమానం సౌకర్యం వుంది. చండీఘర్ దగ్గరగా వున్న కల్కా నుంచి రైలు ద్వారా ప్రయాణించవచ్చు.

 వ్యారో.. మార్గంలో జోగిందర్ నగర్ రైల్వేస్టేషన్లో దిగాలి. ఢిల్లీ నుంచి కులూని రోడ్డు మార్గంలో కూడా 789 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోగలం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు విరివిగా నడుస్తుంటాయి. స్థానికంగా జీపులూ, టాక్సీలూ లభిస్తాయి. కులూలోయలోని దియోదర్ పచ్చిక మైదానం ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా పరిగణించాలి! 

డాల్పూర్ అనేచోట ఎప్పుడు చూసినా ఏవో సంతలూ సంబరాలూ కనిపిస్తాయి. కులూలో వున్న రఘనాథ మందిరం ఎంతో ప్రసిద్ధి చెందింది. కులూ ఓ జిల్లా కేంద్రం! పట్టణానికి ఓ నాలుగు కిలోమీటర్ల దూరంలోని పర్వత గుహలో చిన్న వైష్ణోదేవి మందిరం వుంది. యిక్కడ వున్న రామ, కృష్ణ, శివ మందిరాలు కూడా తప్పక దర్శించదగ్గ ప్రదేశాలుగా పరిగణించబడుతున్నాయి. దగ్గరలోనే ఓ శిఖరం పై వున్న జగన్నాథ మందిరం కూడా యాత్రికులని అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఈ శిఖరాగ్రం నుంచి కులూ లోయ సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది.

kullu the valley of gods

Kullu పట్టణ పరిసరాల్లోనే 2440 మీటర్ల ఎత్తుగల కొండ శిఖరంపై క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దకాలం నాటి పిరమిడ్ ఆకారంలో నిర్మిచబడివున్న బాజేశ్వర్ మహాదేవ్ మందిరం శిల్పకళా చాతుర్యానికి ప్రతీకగా నిలిచి వుంది. పెద్ద పెద్ద రాతి ఫలకాలపై చెక్కిన శిల్పాకృతులు నిండిన ఎత్తైన గోడలు గల ఈ మందిర బహిర్భాగం మన మనస్సుల్లో చెరగని ముద్రల్ని వేస్తుంది.

దాపులోనే ‘బిజ్లో మహాదేవ్’ మందిరం వుంది. ఈ మందిరంలోని దేవదేవుడు ఆకాశంలోని ఉరుముల్నీ, మెరుపుల్నీ ప్రతిఘటిస్తాడని ప్రతీతి ! Kullu కి దగ్గర్లోనే ‘రైసస్’ అనే ఓ గ్రామం పర్వతారోహక బృందాలతో కిటకిటలాడుతూ వుంటుంది. అనేక పర్వత మార్గాలిక్కడి నుంచే ఆరంభమవుతాయి.

 ‘పుల్లా’ అనే ప్రదేశంలోనూ, కిరంగా అన్న ప్రదేశంలోనూ వేడి నీటి బుగ్గ బావులున్నాయి. వీటి నానుకునే పార్వతీలోయ ప్రారంభమవుతుంది. కైషార్ అనే పిక్నిక్ స్పాట్ అనేక యాత్రికుల్ని ఆకర్షిస్తూ వుంటుంది. 2300 మీటర్ల ఎత్తున్న ఈ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం మనల్ని పరవశుల్ని చేస్తుంది.

శోజా అనే ప్రదేశం ప్రకృతి రమణీయకతతో వెల్లివిరిస్తూ వుంటుంది. పశ్చిమ హిమాలయాల్లోని ‘జాలోరి’ కనుమకి మార్గం యిక్కడి నుంచే ఆరంభమవుతుంది. Kullu లోయని ఏ కాలంలోనయినా దర్శించవచ్చు. వేసవితో అత్యధిక ఉష్ణోగ్రత దాదాపు 30 కాగా శీతాకాలం ఉష్ణోగ్రత మాత్రం మైనస్ డిగ్రీలోకి పడిపోతుంది.

Kullu లో నివసించేందుకు అన్ని రకాల వసతి గృహాలూ వున్నాయి. ప్రభుత్వ రంగ హోటళ్ళూ, గెస్ట్ హౌస్ లూ కూడా వున్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ దర్శించేందుకు ఏప్రిల్-నవంబర్ మాసాల మధ్య కాలాన్ని ఎన్నుకోవాలి.

Discover the Mesmerizing Charm of Manali మనాలీ మాయాజాలాన్ని అన్వేషించండి:

కులూ వ్యాలీ లోని ‘Manali‘ ఓ భూతల స్వర్గం! కులూ పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రదేశం ఎప్పుడూ యాత్రికులతో సందడిగా వుంటుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమోత్తర పర్వత లోయలో ‘బీస్’ నదికి పడమటి గట్టుపైన విస్తరించిన ఈ ‘మనాలీ’ ని చేరటానికి మనం కట్రెయిన్, నగ్గర్లను దాటవలసి వుంటుంది. ‘పాతలీకుహ’ అనే ఓ చిన్న నది యిక్కడ ప్రవహిస్తూ వుంటుంది.

Manali ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లు ! ఈ ప్రాంతం అనేకమంది దేశవిదేశీ యాత్రికులని ఆకర్షిస్తూ వుంటుంది. మనాలీ పరిసరాల్లోని ఎన్నో చిన్నగ్రామాల్లో ‘హిప్పీ’ల గుంపులు కనిపిస్తాయి. ఆ గ్రామాల్లో రహస్యంగా గంజాయిని పండిస్తారని వినికిడి! అపుడపుడు కారణం ఏదైనా కానీండి, ఆ గ్రామాలన్నీ కూడా పోలీసు, ఎక్సైజు శాఖల అధికారులు దాడులకు గురవుతుంటాయి.

Manali లోని ‘హిడింబా’ దేవాలయం చాలా ప్రఖ్యాతి గాంచింది. మహాభారత గాథలోని భీముని భార్య అయిన రాక్షస రాణి ‘హిడింబ’ పేరిట ఈ దేవాలయం నిర్మించ బడింది. ఈ దేవాలయాన్నే దుంగ్రీ మందిరం అని కూడా పిలుస్తారు. ఈ మందిరంలో ‘హిడింబని’ హిర్మాదేవిగా పిలుస్తూ పూజలు చేస్తారు. ఈ గుడిని క్రీ.శ. 1553 లో నిర్మించారని అక్కడి శాసనాల వల్ల వెల్లడి అవుతోంది. నాలుగంతస్థుల ఈ ఆలయం ‘పగోదా’ ఆకారంలో వుండి సింహద్వారంలో శిల్ప కళా సౌందర్యాన్ని వెల్లివిరుస్తూ కనిపిస్తుంది.

manali the tourism spot to visit

టిబెటన్ బౌద్ధారామం ఒకటి వుంది. ఆ ఆరామంలో ఎన్నో బుద్ధప్రతిమలూ, బుద్ధుని జాతక కథలు గల ‘తంకాస్’ లనబడే చిత్ర కళాఖండాలు మనకి కనిపిస్తాయి. మనాలీలో ‘మనాల్సూ’ అనే ఓ చిన్న నది ప్రవహిస్తూ వుంటుంది. ఈ నది మత్స్య సంపదకి నిలయంగా భావించబడుతోంది.

“అర్జున గుహ ” మరో దర్శనీయ ప్రాంతం. ఇది కూడా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తూ వుంటుంది. యిక్కడే ‘రాహుల్’ అనే జలపాతం వుంది. ‘వశిష్ఠ’ మరో పుణ్యక్షేత్రం ! మనాలీకి చాలా దగ్గర్లో వుంది. యాత్రాస్థలం కొండ అంచుల్లో విస్తరించి వుంది. అందువల్ల యాత్రికులు చాలా దూరం నడవాల్సి వుంటుంది. 

‘వశిష్ట’ వేడి నీటి బుగ్గ బావులకు చాలా పేరు గాంచింది. ఈ బావుల్లోని నీటిని ఆధునిక స్నానగృహాల్లోకి మళ్ళించి వేడిని అదుపులో వుంచిన షవర్ల ద్వారా యాత్రికులు కందిస్తున్నారు. ఈ స్నాన వాటికల్ని ప్రజల సౌకర్యార్ధం ఉదయం ఏడు నుంచి రాత్రి పదిగంటల దాకా తెరిచి వుంచుతారు.

“కోటి” మరో దర్శనీయ స్థలం ! ఇది మనాలీకి 12 కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రోడ్డుపైన వుంది. యిక్కడ బీస్ నది చాలా లోతుగా ప్రవహిస్తుంది. ఇక్కడ మనకి అనేక హిమాలయ పర్వతాలు సాక్షాత్కరిస్తాయి. పర్వతారోహక బృందాలకిది కూడలి స్థానంగా. పరిగణించబడుతోంది.

మనాలీలో ఓ పర్వతారోహక అధ్యయన కేంద్రం కూడా పనిచేస్తోంది. ‘నెహ్రూ కుండ్‘ అని ప్రథమ భారత ప్రధాని పేరిట పిలవబడుతోన్న ఓ శీతల జలగుండం యిక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది. సోలాంగ్ లోయ మనాలీకి పశ్చిమోత్తర దిశలో వుంది. యిక్కడి నుంచే హిమశిఖరాలు ఆరంభమవుతాయి. మనాలీ నుంచి ఓ పదమూడు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఏ ‘పల్చాన్’ అనే గ్రామంలో మంచుభూములు మొదలవుతాయి.

manali - parvati valley

Unveiling the Serene Secrets of Parvati Valley శాంతియుతమైన పార్వతీ వ్యాలీ రహస్యాలను వెలికితీయండి:

కులూలోయకు పూర్వోత్తర దిశలోని మైదాన ప్రాంతాన్ని Parvati Valley గా పరిగణించటం జరుగుతోంది. కులూ నుంచి ఓ గంట బస్సు ప్రయాణం మనల్ని ‘భుంటర్’కి చేరుస్తుంది. ‘భుంటర్’ ఓ విమానాశ్రయం! ఢిల్లీ నుంచీ చండీఘర్ నుంచీ భుంటర్కి వాయుదూత్ విమాన సౌకర్యం వుంది. ఈ మధ్యనే యిక్కడి నుంచి సిమ్లాకి కూడా విమానయానం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. కులూ నుంచి బస్సులో ఈ లోయలో పర్యటించేందుకు అవకాశం వుంది. 

భుంటర్ నుంచి కులూకు దక్షిణదిశలో వున్న ‘బజేరా’ అనే ప్రాంతం ఓ పవిత్ర శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బసవేశ్వర మహాదేవ మందిరం అతి ప్రాచీనమయినది. ఈ మందిరం అంతా కూడా శిల్ప కళా సౌందర్యంతో నిండుకుని వుంది. మందిరానికి నాలుగువైపులా కూడా శిల్పాకృతులు నిండిన బ్రహ్మాండమయిన ఓ నాలుగు రాతి ఫలకాలు మందిర ప్రాకారాల్లో బిగించబడి వున్నాయి. ‘ఐజేరా’ లో నివసించేందుకు ఓ చక్కని వసతి గృహం కట్టబడింది. పార్వతీలోయలో శివుడు దాదాపు రెండు వేల సంవత్సరాలు తపస్సు చేసాడని ‘లీలంగా’ ప్రాంతంలోని స్థానికులు చెబుతుంటారు.

కులూలోయ, మండీ వైపు నుంచి సముద్రమట్టానికి దాదాపు ఏడువందల యాభై మీటర్ల ఎత్తున ప్రారంభమై రోహతాంగ్ కనుమ ప్రాంతంలో షుమారు నాలుగు వేల మీటర్ల ఎత్తు దాకా వ్యాపించి వుంది. కులూకు దక్షిణదిశ ప్రాంతాన్ని మాత్రమే పార్వతీ లోయగా పిలుస్తారు. భుంటర్కి మరీ దగ్గరగా వున్న ‘జౌట్’ ప్రాంతాన్ని ‘సైంజ్’ వ్యాలీగా కూడా పిలుస్తారు. ఈ లోయలోని జనాన్ని ‘నోమాడ్స్’ (గడ్డీస్) అంటారు.

కులూ లోయ నానుకుని శ్యామానంద తపోకేంద్రం వుంది. ఇది Parvati Valleyగా మార్గంలో వుంది. ఇక్కడి ‘ధల్పూర్‘ మైదానం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దేశంలోనే అతి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న దసరా ఉత్సవాలు జరుగుతాయి. విజయదశమి పర్వదినాన ఆరంభమయిన ఈ ఉత్సవం ఓ వారం రోజుల కాలం కొనసాగుతుంది. ఇక్కడి దసరా సంబరాల్లో రావణాసురుడి బొమ్మని తగల పెట్టబడకపోవటం మనం గమనించాలి.

కులూ – Parvati Valley లోని ఈ దసరా ఉత్సవానికి ఆ లోయల్లో వున్న దాదాపు రెండు వందల మందిర విగ్రహాల్ని ఈ ధాల్పూర్ మైదానానికి తరలించటం ప్రతి ఏటా ఆనవాయితీగా జరుగుతోంది. 

ఈ ఉత్సవంలో ముఖ్యభాగంగా మనాలీ నుంచి ‘హిడింబా’ రాక్షస రాణి విగ్రహాన్ని యిక్కడికి చేర్చిన మరుక్షణం నుంచే, సంబరాలని ప్రారంభిస్తారు. ఆ ‘హిడింబా’ విగ్రహం ధాల్పూర్ని చేరనంత వరకూ ఆ ప్రాంతంలో దసరా సంబరాల అలజడి కనిపించదు. ఈ హిడింబా దేవత వేగాన్ని యిష్టపడుతుందట! అందుకు ఆమె విగ్రహం వున్న రథాన్ని భక్తులు అతి వేగంగా తోలుతారు. 

ఇక్కడి మరో విశేషం ఏమిటంటే మనాలీ నుంచి తీసుకురాబడిన ‘జములూ’ అనే ఈ దేవతా విగ్రహాన్ని ధాల్పూర్ మైదానానికి ఎదురుగా బీస్ నది దేవతామూర్తి ఈ ఉత్సవంలో పాల్గొనదు అవతలి గట్టు పైనే నిలిపివేస్తారు. పండగ రోజుల్లో ‘దేవతా దర్బార్’ లని నిర్వహిస్తారు.

పార్వతీ లోయకి ఎగువగా కులూని దాటాక మనాలీ మధ్య ప్రాంతంలో ‘కుట్రెయిన్’ వస్తుంది. ఇక్కడ కులూలోయ చాలా విశాలంగా దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి 3325 మీటర్ల ఎత్తు వున్న ‘భగాగర్’ పర్వత శిఖరం. నయనానందకరంగా కనిపిస్తుంది.

పార్వతీలోయలోని ‘మలానా’ తప్పక దర్శించదగిన మరో ప్రదేశంగా భావించవలసి వుంటుంది. మలానాకు దగ్గరలోనే ‘చంద్రఖని’ కనుమ ఆరంభమవుతుంది. పైన ఉదహరించబడిన ‘జమ్లు’ దేవాలయం యిక్కడే వుంది. మలానా నుంచి పర్వతారోహక బృందాలకి ట్రెక్కింగ్ దశ ప్రారంభమవుతుంది.

Parvati Valley ప్రాంతంలోని జనం అంతా కూడా ఉన్ని దుస్తులు ఉత్పన్నం చేసే జీవన విధానాన్ని అలవరుచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇతర చేతి పనులకి కూడా ఈ మధ్యనే కొంత ప్రోత్సాహం లభిస్తోంది. స్థలపురాణం ప్రకారం జమ్లు దేవతా మూర్తి ‘హమ్త’ తన భర్త ‘నారోల్’ తో యిక్కడికి వచ్చారట. 

ఆ సందర్భంలో హఠాత్తుగా వారి చేతిలో వున్న ఓ బుట్టలోని యితర దేవతా విగ్రహాలన్నీ కూడా గాలికి ఎగిరిపోయి కులూ, పార్వతీలోయలోని యితర భాగాలకి చేరాయట! అందుకే దేవతలందరినీ దసరా సందర్భంగా ఒకే చోటికి చేర్చటం జరుగుతుంది. పార్వతీ లోయని మార్చి – నవంబరు మాసాల మధ్య కాలంలో దర్శించటం మంచిది. చలిని తట్టుకునేందుకు తగు ఏర్పాట్లని ముందుగానే చేసుకోవటం ఎంతో అవసరం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *