Human life – Good and Evil, Obstacles, And the Legitimacy of A Ruler: విదురుడు Part 5

Human life – Good and Evil, Obstacles, And the Legitimacy of A Ruler: విదురుడు Part 5

Human life – Good and Evil, Obstacles, and the Legitimacy of A Ruler: మనిషి జీవితం – మంచిచెడులు, అవరోధాలు, పాలకుని ప్రామాణికత : విదురుడు

విదురుడు Part 5: మంచిచెడులు చీకటివెలుగులు… అసూయా షడిమే షట్సు జీవంతి సప్తమే నోపలభ్యతే, చౌరాః ప్రమత్తే జీవంతి వ్యాధితేషు చికిత్సకాః, ప్రమదాః కామయానేషు యాజమానేషు యాజకాః, రాజా వివదమానేషు నిత్యం మూర్ఖషు పండితాః!

సమాజంలో రెండు వర్గాలవారుంటారు. ఏమరుపాటు గలిగిన వారు ఒక తెగ.. వారి ఏమరుపాటును గ్రహించి వారి సంపదను దొంగిలించెడి దొంగలు మరొక తెగ.

అలాగే రోగగ్రస్థులు వారికి వైద్యం చేసెడి వైద్యులు; కాముకులైన వారు, వారిని ఆకర్షించి తమ పబ్బంగడుపుకునే వేశ్యలు; యజ్ఞములు చేయు వారున్న చోట యజ్ఞములు చేయించెడి వారు; వివాదాలతో సహజీవనం చేసే అసహనమతులు ఉన్నచోట వారి వివాదాలు తీర్చే రాజులు (న్యాయాధికారులు); మూర్ఖులున్నచోటనే పండితులు ఉంటారంటూ… ఆరు రకాల వారిని పరిచయం చేస్తూ ఏడవ రకమైన వ్యక్తులు ఉండరని చెపుతున్నాడు విదురుడు.

ప్రపంచంలో మంచి చెడు రెండూ ఓతప్రోతమై ఒకదానిని అంటిపెట్టుకునే మరొకటి ఉంటాయి. దేనిని ఆదరించాలి, దేనిని నిగ్రహించాలి అనేది వ్యక్తి విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తి విజయాన్ని అపజయాన్ని అదే నిర్ధారిస్తుంది. ఒకరి బలహీనతను సొమ్ము చేసుకునేందుకు మరొకరు తయారుగా ఉంటారు. ఈనాటి సైబర్ నేరాలే దీనికి సరైన ఉదాహరణలు. ఉచితాల తాయిలాలకు ఆశపడే వారిని ఆకర్షించి ఓటు బ్యాంకున్ను పెంచుకునే “నాయకులు” (కుహనా), రోగిని భయపెట్టి ఆ భయాన్ని సొమ్ము చేసుకునే “వైద్యశేఖరులు” ఇలాంటి వ్యక్తులను అనునిత్యం చూస్తూనే ఉంటాము. వ్యక్తిలో సరైన శీల నిర్మాణం జరిగి, ఏది యుక్తమో ఏది విసర్జించాలో విచక్షణాజ్ఞానం కలిగి ఉంటే ఈ ప్రపంచమే స్వర్గం అవుతుంది.

“మూర్ఖషు పండితాః” అనడం ద్వారా… నీ కుమారులైన కౌరవులు మూర్ఖులు, పాండవులు పండితులు… మూర్ఖులైన కౌరవులను నిగ్రహించే విధానాన్ని తెలిసిన పండితులైన పాండవులు తప్పక విజయసాధకులౌతారని… అన్యాపదేశంగా చెపుతున్నాడు విదురుడు.. లోక సహజమైన కొన్ని నీతులను (ఆ నాటి సామాజిక నేపథ్యంలో) పరిచయం చేస్తున్నాడు, విదురుడు. పశువుల మందను జాగ్రత్తగా కాయాలి. కొద్ది ఏమరుపాటు చూపితే అవి ఏ చేలోనో పడి పంటను నాశనం చేస్తాయి. అలాగే ఉద్యోగులు, 1. వ్యవసాయము (ఇక్కడ వ్యవసాయము అంటే వ్యక్తి చేసే ఏ జీవనోపాధియైనా), భార్య/భర్త, అవివేకులతో మైత్రి… ఇలాంటివి పులి మీద స్వారి లాంటివి. ఏ మాత్రం ఏమరుపాటు చూపినా అపారమైన నష్టాన్ని కలిగిస్తాయి.

అలాగే లోకంలో.. ఉపకారం పొందిన వెంటనే ఆ ఉపకారం చేసిన వాడిని మరవడం కూడా సహజమే అంటున్నాడు. విద్య నేర్పిన గురువును విద్యార్థులు, పెండ్లి చేసుకున్న కుమారులు తల్లిని, పరస్త్రీపై మోహము తీరిన వాడు ఆ సుఖాన్నిచ్చిన స్త్రీని, ప్రయోజనం తీరిన వెంటనే ప్రయోజనాన్ని కలిగించిన వారిని, ఏరుదాటిన వెంటనే నావను, వ్యాధి తగ్గగానే వైద్యుని మరచిపోవడం సహజమే అంటున్నాడు.

ఇలా లోకసహజమైన అంశాలను ధృతరాష్ట్రునికి వివరించడం ద్వారా… పరోక్షంగా సమాజానికి హితవు పలుకుతున్నాడు విదురుడు. ఒక సాధువును పరీక్షించాలని, అపహాస్యం చేయాలనే భావనతో ఒక వ్యక్తి తన చేతిలో ఒక పక్షిని పట్టుకొని వచ్చి “ఈ పక్షి ప్రాణంతో ఉన్నదా మరణించిందా…” అని అడిగాడట. అది ప్రాణంతో ఉన్నదంటే దానిని చంపేవాడు, మరణించింది అంటే ప్రాణంతో చూపేవాడు. అది గ్రహించిన ఆ సాధువు “భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది” అన్నాడు. అలాగే మనందరి భవిష్యత్తు కూడా మన చేతిలో ఉన్నది. నిజానికి ప్రతి వ్యక్తి భవిష్యత్తు వారి చేతిలోనే ఉంటుంది. దానిని వ్యక్తి సమున్నత మార్గంలో తీసుకుపోవచ్చు లేదా జీవితాన్ని నరకప్రాయం చేసుకోవచ్చు. వర్తమానంలో జీవిస్తూ… చేసే పనిలో ఆనందం పొందే వ్యక్తి విజయ మార్గంలో పయనించడమే కాదు, ఉన్నతమైన భవితనూ పొందగలుగుతాడు.

ఏ కార్యాన్ని నిర్వహించాలన్నా.. ఆ కార్యం పట్ల నిబద్ధతతో కూడిన ప్రయత్నం అవసరం. నిబద్ధతతో కూడిన ప్రయత్నశీలత.. వ్యక్తి వ్యక్తిత్వ వికసన ద్వారా, శీల నిర్మాణం ద్వారా లభిస్తుంది. బాధ్యత తీసుకునే స్వభావం వల్ల ప్రకటితమౌతుంది. నిజానికి బాధ్యత తీసుకోవడం అనేది “భగవంతుడు” అయితే… ఆ ప్రయత్నం విజయవంతమౌతుందనే “విశ్వాసం” ఆ భగవంతుని చేర్చే త్రాడు లాంటిది. విశ్వాసంతో బాధ్యతాయుత ప్రవర్తన వల్ల విజయసాధన సులువవుతుంది.

కార్యనిర్వహణలో, వ్యక్తుల మధ్య సుహృద్భావము, సౌహార్ద్రత, వ్యాపార ప్రతిష్టలు లాంటివి విలువైన వస్తువులకన్నా కూడా విలువైనవి. బాధ్యతాయుత ప్రవర్తన, విశ్వాసము ఈ రెండూ అంతరంగ వికాసంలోంచి వెలువడవలసినవే. అవి సహజమైనవి కాకున్నా ప్రయత్న పూర్వకంగా సంతరించుకోవలసినవి. ఏకాగ్రతతో మన మనస్సుకు/ హృదయానికి సందేశాలు పంపుకోవడం, మనస్సు/ హృదయం నుండి సందేశాలు గ్రహించడం.. రెండూ అవసరమే. ఏ విధమైన పూర్వ నిశ్చితాభిప్రాయం లేకుండా హృదయంతో సంబంధాలు కొనసాగించే వ్యక్తి సన్మార్గంలో పయనిస్తాడు. బద్ధకానికి, వ్యసనాలకు దూరంగా చేసే పని పట్ల ఏమరుపాటు లేకుండా బాధ్యతతో ప్రయత్నాన్ని కొనసాగిస్తారో వారే విజయ సాధకులు అవుతారు.

vidura niti vidura neethi vidurudu

మనిషి అభ్యుదయానికి అవరోధాలు

ఈర్క్ష్యు ర్హృణీ న సంతుష్ట్ః రోధనో నిత్య శంకితః పరభాగ్యోప జీవీ చ షడైతే నిత్య దుఃఖితాః!

ఈర్ష్య, దీనత, అసంతృప్తి, క్రోధము, ఎల్లప్పుడు అన్నింటినీ శంకించుట, పరుల సొమ్ముపై బ్రతుకుట… ఈ ఆరు లక్షణములు గల వారికి ఎప్పుడూ దుఃఖమే అంటాడు.విదురుడు.

ఈ ఏడు లక్షణాలకు మూలం వ్యక్తిలో కలిగే ఏడు దోషాలు అంటాడు. అవి స్త్రీ పట్ల మోహము, ద్యూతవ్యసనము, మద్యపానము, పలుకులో కఠినత్వము, శిక్షించడంలో అమానవీయత, వృథాగా ధనాన్ని వ్యయం చేయడం… ఈ ఏడింటినీ దోషాలుగా చెపుతూ… ఈ ఏడు దోషాలు పైన పేర్కొన్న ఏడు లక్షణాలకు కారణమౌతాయంటున్నాడు. వ్యక్తులు ముఖ్యంగా పాలకులు ఈ లక్షణాలను, వాటికి మూలమైన దోషాలను విడిచిపెట్టాలని చెపుతున్నాడు. వాటిని ఆదిలోనే విడవకపోతే అవి వేళ్ళు పాతుకొని జీవితాన్ని ఛిద్రం చేస్తాయని హెచ్చరిస్తున్నాడు.

మానవ జీవితం ఉదాత్త ప్రయోజనాన్ని సాధించేందుకు ఉద్దేశించబడింది. జాగ్రత్తగా గమనిస్తే… సంకల్పశుద్ధి కలిగిన వారు ఎన్ని అవరోధాలు ఎదురైనా తాము సంకల్పించిన కార్యాన్ని సాధించగలుగుతారు. ఆ సాధనలో ఎదురయ్యే అవరోధాలను ప్రకృతి ముందుగా సూచనప్రాయంగా సూచిస్తూ హెచ్చరిస్తుంది. కాని మనమే ఆ హెచ్చరికను పట్టించుకోము. దుఃఖకారకాలయిన దోషాలను ఆదరించే వ్యక్తి నాశనానికి ముందే కొన్ని సూచనలు ప్రకృతి చేస్తుందనుకున్నాము కదా.. వాటిని పరిశీలిస్తే… మనసులో పొడసూపిన గర్వం వల్ల బ్రహ్మవేత్తలను, విద్వాంసులను, చదువరులను, యోచనాపరులను, తన ఉన్నతిని కోరి మంచిచెడులను తెలియచేసే ఆత్మీయులను ద్వేషించడం, వారితో కలహించడం జరుగుతుంది. తన వ్యసనాలను తీర్చుకునేందుకు అవసరమైన సొమ్ముకై అలాంటి వారిని మోసగించడం, వారి సొమ్మును దొంగిలిస్తాడు. వారిని ఎవరైనా నిందిస్తే అది తనకు ఆనంద హేతువవుతుంది. వారి గొప్పదనాన్ని ఎవరైనా ప్రశంసించినా, వారి ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రస్తావించినా అది తనకు కంటకింపుగా అనిపిస్తుంది.. మెచ్చలేని, చెప్పలేని బాధకు కారణమౌతుంది. 

తనకు సామర్ధ్యం లేని పనులు తలపెట్టి, ఆ కార్యనిర్వహణలో వారి సహాయం పొందదగినదే అయినా వారి సహకారాన్ని కోరడు.. ఒకవేళ ఎవరైనా తనకాసలహా చెప్పినా పట్టించుకోడు, వారి సహాయాన్ని అపేక్షించడు. తమ కార్యావిష్కరణలో ఎవరైనా తనను తప్పొప్పులయందు  విశ్లేషణ చేసి సూచనలు కావాలని అడిగితే రంధ్రాన్వేషణ చేస్తూ లేని తప్పులు వెతుకుతాడే గుణములను పట్టించుకోడు, తన దృష్టికి వచ్చినా వ్యక్తీకరించడు. ఎవరైతే సమున్నత లక్ష్యసాధనా దీక్షతో జీవితాన్ని సార్ధకం చేసుకోవాలనే భావనతో ముందుకు సాగుతారో వారీ దోషాలను తమలో గుర్తించి, వాటిని అధిగమించాలని చెపుతున్నాడు విదురుడు.

విద్యామదం కాని, ధనమదం కాని అధికారమదం కాని బంధుమిత్రులు బలం చేత కలిగిన మదం కాని, మద్యం మత్తుకాని తనకు అహంకారపు మత్తును కలిగిస్తే… ఆ వ్యక్తి మంచిచెడ్డలను పట్టించుకోడు. అలాగే పొరపాటు చేసిన వాడు, ఇతరులపట్ల పొరపాటు అభిప్రాయాన్ని కలిగినవాడు, పిచ్చివాడు, కార్యవ్యగ్రతవల్ల అలసిపోయినవాడు, క్రోధస్వభావం కలిగిన వాడు (లేదా ఒక ప్రత్యేకమైన సంఘటనలోనైనా కోపాన్ని పొంది దానిని క్రోధంగా మార్చుకున్నవాడు.. తానెంత విజ్ఞుడైనా ఆ క్రోధాన్ని విడువనంత వరకూ) బాగా ఆకలితో అలమటించే వాడు, తొందరపాటు స్వభావం కలిగినవాడు, అత్యాశ గల వాడు, భయపడినవాడు, కాముకుడు ఇలాంటి వారికి మంచిచెడ్డల పట్ల ఆదరణ ఉండదు. వారి వ్యక్తిత్వం పరిణతి చెందేందుకు సహకరించదు.

 తాము ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఆ కళ్ళద్దాలగుండా ఇతరులను పరిశీలిస్తుంటారు కాబట్టి లోకాన్ని అదే దృష్టితో చూస్తుంటారు. తమ పూర్వనిశ్చితాభిప్రాయాలను మార్చుకునేందుకు ఇష్టపడరు. పండితుడైన వాడు.. లేదా ఉన్నత కార్యాన్ని ఆవిష్కరించాలనే భావన కలిగిన వాడు, ఇలాంటి వ్యక్తులతో సహవాసము చేయవద్దు… ఒకవేళ ఆ పరిస్థితులు వస్తే వీలైనంత త్వరగా ఆ వలయం నుండి బయటకు రావాలి అంటున్నాడు విదురుడు.

అలాగే ఆడంబరాలకు విలువనిచ్చేవాడు, మోహాంధుడై ఇతరులను అవమానించే వాడు, ద్వేషభావనలతో ఇతరులను హింసిస్తూ పాపములు చేయువాడు, రాజశాసనాలను అతిక్రమించడం, ధనలోభం చేత, స్వార్థపరతవల్ల దేశ భద్రతకు సంబంధించిన విషయాలను శత్రుదేశాలకు అందించేవాడు, శత్రుమిత్ర భావనలేక ప్రతి చిన్న అంశానికీ సహనం కోల్పోతూ ఇతరులతో కలహించేవాడు, పొగరుబోతులై దుర్జన సాంగత్యంలో శాస్త్రకారులను అవమానించేవారు, పిచ్చివారు… ఇలాంటి వారికి దూరంగా ఉండటం ఉత్తమం అంటాడు అంటాడు.

ఏ లక్షణాలు మానవుని అభ్యుదయానికి అవరోధాలో వాటిని సరిగా తెలుసుకొని దానికి దూరంగా ఉండటం వల్ల మనుజులు విజ్ఞులు, కార్యసాధకులు అవుతారు.

పాలకుని ప్రామాణికత ఏమిటి?

యః కామమనూ ప్రజహాతి రాజా పాత్రే ప్రతిష్ఠాపయతే ధనం చ విశేష విఛ్రుతవాన్ క్షిప్రకారీ తం సర్వలోకః కురుతే ప్రమాణమ్!

ఏ ప్రభువు లేదా పాలకుడు కామక్రోధములను విడనాడునో, ధనమును సత్రమున వినియోగించునో, తరతమ భేదములను చక్కగా తెలిసికొనునో, విద్యా సంపన్నుడగునో, కార్యములను ఆలసింపక చేయునో అట్టి వానిని లోకమంతయు ప్రమాణముగా స్వీకరించును. ప్రజలకు తనపై నమ్మకము కలిగించువాడు, శిక్షార్హులను తగిన విధంగా శిక్షించువాడు, క్షమార్హులను క్షమించువాడు సమగ్రమైన సంపదను పొందును. అలాంటి పాలకుడు బలహీనుల పట్ల ఆదరంగా ఉంటాడు, బలవంతులతో అనవసరమైన వైరాన్ని కోరుకోడు.. సమయం వచ్చే వరకు శత్రువు పట్ల నిరీక్షాభావంతో ఉండి, తగిన సమయంలో పరాక్రమం చూపుతాడు.

నిజానికి అతి ధార్మికత్వం లేదా అతి నిరీహత (కోరికలు లేకపోవడం) పాలకునికి పనికిరాదు. ఎవరినైనా అతిగా విశ్వసించడం ప్రమాదకరమే. సోమరియైన పాలకుడు విపత్తులను ఎదుర్కోవలసి ఉంటుంది. సమయానుకూల వర్తన సత్ఫలితాలనిస్తుంది. మోసాన్ని మోసంతోనూ, నీతివంతులను నీతిగత వ్యక్తిత్వంతో ఎదుర్కోవాలి.

పాలకుడు ధర్మానువర్తియై తన ఆదాయాన్ని సమకూర్చుకోవలసి ఉంటుంది. కోశాగారంలో విశ్వాసపాత్రులను పెట్టాలి. వేతనాలకు ఆదాయంలో 25% మించి వ్యయించడం ప్రమాదహేతువే. దానివల్ల పాలకుడు తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడుతాయి. అత్యంత ప్రాధాన్యతాంశంగా భారతం పరిగణించేది “దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలను పోషించాలి” అనే అంశాన్ని.

రాజా! భూమిపై ఉన్న ప్రతివ్యక్తి “అవసరాలను” భూమియే తీరుస్తుంది. కాని దాచుకోవడం, దోచుకోవడం ప్రాతిపదికగా ఏర్పడిన వ్యక్తిలోని “ఆశను” సమస్తమైన భూమి కూడా తీర్చలేదు. ఆశ అనబడే చెడును నిగ్రహించగలిగితే మంచి అనబడే ఆశయాలు అవే ప్రకాశితమౌతాయి.

చేరుతుంది. ఒకటి… ఒకరు చెప్పే మాటల ద్వారా.. రెండవది మనం చూసే దృష్టి ఒకరి మీద ప్రేమ లేదా ద్వేషం అనేది రెండు మార్గాల ద్వారా మనకు కోణం ద్వారా… నిజానికి మనం వినేదంతా చెప్పేవారి అభిప్రాయమే కాని ‘నిజం’ నక్కరలేదు. అలాగే మనం చూసినది కూడా మన దృష్టి కోణమే కాని ‘వాస్తవం’ కానక్కరలేదు. విన్నదీ, చూసినదీ సమాచారమే. దానిని విశ్లేషించుకొని, బుద్ధితో విచారించి సత్యాన్ని” గ్రహించాలి. ఎవరైనా తన తెలివితేటలు సమాజ హితానికి వాడాలే కాని వినాశానికి వాడకూడదు. సహనంతో కూడిన చెవులతో వినడం, దయాపూరిత కన్నులతో చూడటం, ప్రేమతో మాట్లాడటం వల్ల ప్రపంచమే పాదాక్రాంతమౌతుంది.

రాజా! ఇప్పుడు సమస్య వచ్చింది. దీనికి పరిష్కారమూ అవసరమే. అది నీ చేతులలోనే ఉన్నది. సమస్య – అవసరం నేర్పే పాఠాలు ఏ గురుకులాలు నేర్పవు, ఉపాధ్యాయులు నేర్పరు. ఒక పక్షి తన గూడు కట్టుకునే విధానాన్ని పరిశీలిస్తే… మన తెలివిహీనత అవగతమౌతుంది. ఏ వనరులు, వసతులు లేకున్నా.. తనకు ఎవరూ మార్గదర్శన చేసి నేర్పకున్నా పక్షి అద్భుతమైన గూడును నిర్మించుకుంటుంది. అలాంటప్పుడు, చిన్న పక్షికి ఉన్న ఇంగిత జ్ఞానము, ఇన్ని శాస్త్రాలు చదివి… ఇన్ని సంభారాలు సమకూర్చుకున్న మనకు లేదా… శాంతిని మనమూ సాధించలేమా… పరిస్థితులు ఎంతగా దిగజారినా (దిగజారాయని మనమనుకున్నా) దానిని పునరుద్ధరించి శాంతిని సాధిస్తామనే సకారాత్మకమైన నమ్మకమే ముందుకు తీసుకుపోతుంది.

dritharastra- vidura

మన “మెదడును” ఉపయోగిస్తే మనలను నిగ్రహించుకోగలం… కాని హృదయాన్ని ఉపయోగిస్తే ఎదుటివారిని గెలవగలము. ఎదుటివారి తప్పిదాలను గుర్తించడం సులువే కాని మనలోని తప్పిదాలను గుర్తించడం అత్యంత కష్టసాధ్యం. పాండవుల పట్ల నీ దృష్టి కోణాన్ని మార్చుకొని హృదయంతో వారిని అవగాహన చేసుకో.. అనవసర యుద్ధాన్ని నివారించిన వాడవవుతావు. పాండవులు నీ బిడ్డల లాంటి వారే.. ఇప్పటి సమస్యాపరిష్కారంలో నీవే స్వయంగా పూనుకోవలసి ఉంటుంది. నీవే చేయగలిగిన పనికై ఇతరులపై ఆధారపడటం సరైనది కాదు. చిత్తశుద్ధితో కూడిన స్వశక్తి – స్వావలంబన వల్ల పురోగతి, ఒకరిపై ఆధారపడటం వల్ల తిరోగతి కలుగుతుంది. మొక్క ఎదగాలి అంటే ఎలాగైతే సూర్యరశ్మి, వర్మపు నీరు అవసరమౌతుందో.. అలాగే నీ బిడ్డల ఎదుగుదలకు నీ ప్రేమాదరణలు, అవసరమైన వేళ మందలింపులూ అవసరమౌతాయి. వారికి నీ ఆదరణ ప్రేరణనిస్తుంది, మందలింపులు ఆత్మ విమర్శకు దారి చూపుతాయి.

vidura-విదురుడు

రాజా! నీకీరాత్రి నిద్దురపట్టకపోవడానికి కారణం, నీలో కలిగే “ఒత్తిడి”. అనుకున్నదానికి లేదా ఊహించిన దానికి వాస్తవంగా జరుగుతున్న దానికి మధ్య ఉండే అంతరమే ఒత్తిడి. ఆ రెంటి మధ్య అంతరం ఎంతగా పెరిగితే ఒత్తిడి అంతగా పెరుగుతుంది. ఒత్తిడి సంఘర్షణకు దారితీస్తుంది. సంఘర్షణ వల్ల అవాంఛనీయ పరిణామాలు కలుగుతాయి విదురుడు

ప్రతి వ్యక్తి జీవితంలో ఒత్తిడి సహజ ప్రక్రియ. దానిని భరించే శక్తి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఆ పరిమితులను దాటితే శరీరమే సూచనలు ఇస్తుంది. ఆ సూచనలు పట్టించుకోకుండా మొండిగా ముందుకు సాగితే అది మనిషి ఆరోగ్యాన్నిదిగజార్చుతుంది. అయితే ఒత్తిడిని భరించే సామర్థ్యాన్ని వ్యక్తి పెంచుకోవచ్చు. ధ్యానం దానికి సాధనం. అలాగే నిర్ణీతమైన విధానంలో క్రమశిక్షణతో వ్యాయామం చేయడం కూడా ఉపయుక్తం.

చెఱసాల కమ్ముల నుండి ఇరువురు ఖైదీలు బయటి ప్రపంచాన్ని చూస్తున్నారు. అందులో ఒకరికి ఎదురుగా నేలపై ఉన్న బురద కనిపిస్తున్నది. రెండవ వానికి ఆకాశంలో ఉన్న అందమైన నక్షత్రాలు కనిపించాయట. చూసే దృష్టిని మార్చుకుంటే ప్రపంచం “సకారాత్మకం”గా కనిపిస్తుంది. సాధ్యప్రయత్నం వల్ల సుసాధ్యమౌతుంది.

 అన్నింటికన్నా ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించు కోవడం ఏది అత్యవసరం ఏది ముఖ్యమైనది, ఏది వాయిదా వేయవచ్చు, ఏది పూర్తిగా వదిలివేయవచ్చు ఏది ప్రాధాన్యతాంశం ఏది కాదు అనే అవగాహనను పొంది ఆ పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించుకునే వ్యక్తి ఎంత పనిలోనైనా ఒత్తిడికి గురికాడు. మారుతున్న పరిస్థితులలోకి, పరిణామాలలోకి ఒక్కసారి తొంగిచూస్తే సమస్య పరిష్కారానికి నూతన అవకాశాలు ఎన్నో కనిపిస్తాయి. వాటిని ఎంత త్వరగా గుర్తిస్తే, ఎంత సమర్ధవంతంగా వినియోగించుకుంటే, ఆ నేర్పును సంతరించుకుంటే సమస్య అంత త్వరగా పరిష్కారమయి విజయానికి అంత దగ్గరగా ఉంటాము.

ఈనాడు సమస్త క్షాత్ర జాతి ఔన్నత్యం కాపాడబడాలి అంటే ఆ జాతిలో ధైర్యసాహసాలు మిక్కిలిగా ఉండాలి. ఎన్ని సుగుణాలు ఉన్నా అన్నింటినీ మించి ధైర్యం ముందుండాలి.. ఆ ధైర్యం లేనినాడు స్వతంత్రము కూడా నిలవదు.. పిరికితనం కలిగిన జాతులు పతనం కాకతప్పదు. యుద్ధ భయం వీడితేనే క్షాత్ర జాతిలో శాంతి నిలుస్తుంది… కాబట్టి సరైన నిర్ణయం తీసుకోమంటాడు విదురుడు

పోరునష్టం పొందులాభం

‘నస్వే సుభే కురుతే ప్రహర్షం నాన్యస్య దుఃఖే భవతి ప్రహృష్టః దత్వా చ పశ్చాత్ కురుతే న తాపం స కథ్యతే సత్పురుషార్య శీలః!

కొంచమైనను తగపంచి కుడువ మేలు పనుల యెడ దుఃఖమోర్చి యల్పంబు, సుఖము ననుభవించుట హితము, శత్రునకు నైన నిచ్చుటయే లెస్స యడిగిన యెడ నృపాల!

చక్రవర్తియే కాక ప్రజ్ఞాశాలి, వివేకశీలి, రాజకీయ, నీతిశాస్త్రాలను అధ్యయనం చేసిన ధృతరాష్ట్రునికి నీతికోవిదుడైన విదురుడు… అలతి అలతి వాడుక పదాలతో.. గంభీరమైన, అర్థపుష్టిగల నీతిని ఉపదేశించాడు. సాధారణంగా పై పద్యానికి…

రాజా! “మానవుడైన వాడు కొంచమైనా ఇతరులకు ఇవ్వాలి. చిన్న సుఖం అనుభవించేందుకైనా దుఃఖాన్ని ఓర్చుకోవాలి. అడిగినవాడు శత్రువైనా వానికి లేదనకుండా ఇవ్వడం న్యాయం, అనేది సాధారణార్ధంగా ఉన్నాయి. ఇందులో తనకే కొంచం ఉన్నా అందులో ఎంతో కొంత ఇతరులకు పంచి ఇవ్వాలనే ధర్మశాస్త్ర భావన ఉంది. తనను యాచించిన వానికి అన్నము లేకున్నా ఉన్న మంచినీరునిచ్చిన రంతీదేవుని గూర్చి విన్నారు కదా… ఏమీలేకున్నా ఉన్నదానిలోనే ఇవ్వగలిగి నంత ఇచ్చాడు. ఓ రాజా! అఖండ సామ్రాజ్యం నీ అధీనంలో ఉన్నది…. అందులో ఎంతో కొంతైనా పాండవులకు ఇవ్వడం సమంజసమనే భావన ఉన్నది.

సాధారణంగా భౌతిక జీవనంలో మానవుడు సుఖమయ జీవితాన్ని గడపాలని భావిస్తాడు. కాని వ్యక్తిగత ద్వేషాలు, బలహీనతలు, ఆశామోహాలు ఆ సుఖమయ జీవితాన్నుండి ప్రక్కకు లాగి దుఃఖమయ జీవితాన్ని ప్రసాదిస్తాయి. అయినా ఆ దుఃఖాలన్నీ భరించి తన కర్తవ్యం తాను నిర్వహించడం ఉత్తమం. కర్తవ్య నిర్వహణలో కలిగే అల్పమైన సుఖమైనా మేలు అంటాడు విదురుడు. ఏ నాడైనా ఏ దేశమైనా ఆంతరంగిక భద్రతకై వెచ్చించే మొత్తం అధికంగానే ఉంటుంది. ఎదుటి వాడు ఎప్పుడు మనల్ని ఆక్రమిస్తాడోననే భయం వెన్నాడుతూనే ఉంటుంది. దానివల్ల ధనవ్యయమే కాక మనశ్శాంతినీ కోల్పోవాల్సివస్తుంది. ప్రక్కలో బల్లెం లాంటి శత్రువును మిత్రునిగా చేసుకుంటే ఆయా వనరులను మరొక అభ్యుదయకారకమైన వాటిపై వినియోగించవచ్చు. బలవంతుడైన శత్రువు నీ వద్ద చేయిజాచి అడిగినప్పుడు సహాయం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది అంటాడు విదురుడు. ఈ పద్య భావం విదురుడు ఆనాటి సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పినా అది సర్వకాలికమై నిలిచింది… సర్వజనీనమూ అయింది.

చితి లాంటి చింత…

వనే జాతాః శాపదగ్ధస్య రాజ్ఞః పాండో పుత్రాః పంచ పంచేంద్ర కల్పాః త్వయైవ బాల వర్ధితాః శిక్షితాశ్చ తవాదేశం పాలయ న్యాంబికేయ!

ఓ అంబికాతనయా.. ధృతరాష్ట్రా! నీలో సందిగ్ధత నెలకొని ఉన్నది. నీ తమ్ముని కుమారులపై ప్రేమా ఉన్నది. నీ కుమారులను అతిక్రమించలేని బలహీనతా ఉన్నది. రెంటినీ సమన్వయం చేసుకోలేని మానసికస్థితి నీ అశాంతికి కారణం. సందిగ్ధత హేయత్వము.. ఆ సందిగ్ధతను విడిచి కర్తవ్యాన్ని నిర్వహించు. జరగబోయే పరిణామాలను గూర్చిన విచారంలో నీలో వంత లేదా చింత కలుగుతున్నది. చెట్టు తొర్రలో ఉన్న నిప్పు రవ్వ చెట్టునెలా కాల్చివేస్తుందో అలాగే వంత చేత వ్యక్తి కాల్చబడతాడు.

నీ తమ్ముడు పాండురాజు శాపముచే కాలిపోయాడు. అడవిలో జన్మించిన అతని కుమారులు అయిదుగురూ అయిదుగురు ఇంద్రులతో సమాన తేజస్కులు. వారిని పసితనమున నీవే పెంచావు, చదువు సంధ్యలు చెప్పించావు. ఆ ప్రేమాభిమానాలను గుర్తుచేసుకో. నీ ఆజ్ఞను వారెప్పుడూ పాలిస్తూనే ఉన్నారు. అలాంటి వారికి తగిన రాజ్య భాగాన్ని ఇవ్వడం వల్ల నీ చింత, వంత తీరుతుంది… నీ యశస్సు, కీర్తి కూడా జగద్విఖ్యాతమౌతుంది. ఆలోచించు….

రాజా! ప్రశాంతమైన సరస్సులో చిన్న రాయిని విసిరితే జరిగే కల్లోలం ప్రశాంతమవడానికి కొంత సమయం పడుతుంది. లక్క ఇంటిని కాల్చిన సమయం నుండి కౌరవులు పాండవులకు చేసిన అపచారాలు అనేకం. అయినావారు సంధిని కోరుతున్నారు. సంధి జరిగితే ఇరువర్గాలు ప్రశాంతమౌతాయి. పెద్దవానిగా ఆ సమస్యను పరిష్కరించడం నీ బాధ్యత. సత్యాన్ని దర్శించే శక్తిలేని వాడివి నీవు. సత్యాన్ని దర్శించగలిగీ చూడనిది గాంధారి. అసత్యాన్ని సత్యంగా భ్రమిస్తూ, తన భ్రమనే మీకు దర్శింపచేస్తున్న వాడు, దుర్యోధనుడు. ఈ నేపథ్యంలో ఉన్నది ఉన్నట్లుగా నీవెలా చూడగలుగుతావు. సాధ్యాసాధ్యాలను మన పూర్వ నిశ్చితాభిప్రాయాలకు అతీతంగా పరిశీలించాలి. జీవితంలో సాధ్యాసాధ్యాలు నాలుగు విభాగాలుగా కనిపిస్తాయి.

 మనం ఏర్పరుచుకున్న ఊహలకు మించి కనిపించవచ్చు. తక్కువగా కనిపించవచ్చు. సమానంగానూ ఉండవచ్చు లేదా వ్యతిరేకంగానూ ఉండవచ్చు. ఆ పరంపరలో కోరికలు, ఆలోచనలు, ఆశలు ఇవన్నీ వ్యక్తి ఊహల నుండి వచ్చేవే. మన శక్తియుక్తులు, సామర్థ్యాలు జీవన నిర్వహణ కేంద్రంలో నిరాశానిస్పృహలు, మనస్సు విరిగిపోవడం… మనోవైఫల్యం… (Frustration) అంటాము. దూరం పెరిగితే అసంతృప్తి పెరుగుతుంది. ప్రస్తుత స్థితి గంభీరమైనది. ఈ పరిస్థితులలో నీకు ప్రశాంతత నిచ్చే అంశాలను విను…

1. వాస్తవిక పరిస్థితులను గుర్తించు… నీ/ నీ వారి /పాండవుల కోరికల మూలాలను గుర్తించు.

2. సంభావ్యతలను, ప్రత్యామ్నాయాలను, వాటి పరిణామాలను నిశితంగా అంచనా వేయి. వాటిని సమగ్రంగా అర్థం చేసుకొని అందులో ఉత్తమమైన దానిని ఎన్నిక చేసుకో..

3. ఎన్నిక చేసుకున్నాక దాని వల్ల వచ్చే ఫలితాలను పూర్తి బాధ్యతతో అంగీకరించు. ఆలోచన నీది, అంచనాలు నీవి, ఎన్నిక నీది ఫలితాలు ఉత్తమమైనవైనా కాక పోయినా బాధ్యత కూడా నీదే.

4. నిజానికి ఈ ప్రక్రియలో “ఈ ఫలితం నేను ఆశించింది కాదు” అనుకోవడం లేదా మనమాశించిన ఫలితం రాకపోతే మనకది కోప కారణమౌతుంది.

5. ఇక్కడ రెండు అంశాలున్నాయి. ఫలితం మన ఊహలకు దూరంగా ఉన్నా దానిని స్వీకరిస్తాము అది మన “ఓర్పు”నకు నిదర్శనంగా నిలుస్తుంది. దానిని స్వీకరించకపోతే అది “అసహనానికి” గురిచేస్తుంది.

6. ఎప్పుడైతే అనిశ్చితస్థితి లేదా పరిస్థితులు ఎదురవుతాయో… దానిని స్వీకరించలేని మానసిక పరిస్థితి మనలో ఆగ్రహానికి కారణమౌతుంది. ఆగ్రహం భయాన్ని ప్రసాదిస్తుంది. దానిని స్వీకరించగలిగిన మనస్సు భయాన్ని జయించగలుగుతుంది. 

7. ఎదురైన పరిస్థితులను స్వీకరించలేని మనస్సులో నకారాత్మక భావోద్వేగాలు జనిస్తాయి. పైకి ఆత్మీయతను ప్రకటించినా అంతరంగంలో వారి ఉనికిని స్వీకరించక పోవడం, వారి గూర్చిన Concern లేకపోవడం వల్ల వారి సన్నిధిలో ప్రశాంతతను పొందలేము. వారిని స్వీకరించడం అంటే వారి బాగోగులను గూర్చి ఆలోచించడం… దాని వల్ల “సకారాత్మక భావోద్వేగాలు” జనిస్తాయి. లోపాలు లేని వ్యక్తులు ప్రపంచంలో ఎవరూ లేరు. ఎదుటివారి లోపాలను అర్థం చేసుకోవడం, వారిని గుర్తించడం వారిని అంగీకరించడం… స్వీకరించడంలో శాంతి ఉన్నది.

 8. రాజా.. ప్రపంచంలో మన ఆలోచనలకు అనుగుణంగా ఎవరూ మారరు… మనం మారితే ప్రపంచం మారుతుంది. మనం చూస్తున్న కళ్ళజోడును మార్చుకోవడం వల్ల మాత్రమే ప్రపంచం సౌందర్యవంతంగా కనిపిస్తుంది.

9. జీవితం మన భావోద్వేగాలకనుగుణంగా నడిచేందుకు రూపకల్పన చేయబడలేదు. మన భావోద్వేగాలు మన జీవితాన్ని ఏ మాత్రం మార్చలేవు.

10. నిన్న గొప్ప ఆవిష్కరణలు చేసిన వ్యక్తి ఈ రోజు లోపభూయిష్టమైన ఆవిష్కరణలు చేయవచ్చు. అందరూ అన్ని సమయాలలో ఉన్నతత్త్వాన్ని ఆవిష్కరిస్తారని ఊహించలేము.

11. మార్పును అంగీకరించు… ఇప్పటివరకు మనం చేస్తున్న పనిలో ఏ పరిణామాలు ఫలితాలు వచ్చాయో వాటిని మార్చలేము… వాటిని అంగీకరించి… నూతన మార్గంలో సమస్యను చూడటం… తక్కువ నష్టంతో బయటకు రావడం ఉత్తమోత్తమం.

12. రాజ్యసాధన, శత్రువులను జయించడం అవసరమైనవే కాని దానికన్నా ఆత్మీయులను ముఖ్యంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం సరైనది కాదు. ప్రజల సుఖసంతోషాలలోనే పాలకులకు/ నాయకులకు ఆనందం ఉన్నది.

13. పాలకులు సరైన వారయితే ప్రపంచమే శాంతిమయ మౌతుంది. నడిచే దారిలో ఎదురయ్యే “U turn మనకు “you turn అంటుంది. మనం రూపాంతరం చెందడం వల్ల ప్రపంచం రూపాంతరం చెందుతుంది. సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల అందరికీ శ్రేయస్సు కలుగుతుంది.

మనస్సులో స్వీకరణ కలిగినప్పుడే భయం, అసహనం, కోపం తగ్గిపోతాయి. పరిస్థితులను అర్థం చేసుకుని, వాటిని సమర్థంగా ఆమోదించగలిగితే మనలో ధైర్యం, స్థైర్యం పెరుగుతాయి. అందుకే, ఆత్మస్థైర్యంతో, పరిణామాలను అంగీకరిస్తూ, మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగటం నిజమైన జయము.

మిగితాది పార్ట్ 6 లో...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *